‘నేను రావడం లేదు.. మీరు రావద్దు’

ముంభై : బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రతీ ఆదివారం ముంబైలోని జల్సా బంగ్లా ఇంటి వద్దకి వచ్చి అభిమానులని పలకరించి వెళుతుంటారు. ఈ సంప్రదాయాన్ని గత కొన్నేళ్ళుగా పాటిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఆదివారం మాత్రం తన అభిమానులు, శ్రేయోభిలాషులు ఎవరిని రావొద్దని తన ట్విటర్లో పేర్కొన్నాడు. ‘ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి భారత్లో కూడా అడుగుపెట్టింది. ఇప్పటికే 93 మంది కరోనా బారీన పడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్లుగా జల్సా బంగ్లాలో నన్ను కలవడానికి వచ్చే సంప్రదాయాన్ని పక్కనపెడదాం. ఇప్పటికైతే అభిమానులు ఎవరు జల్సా గేట్ వద్దకు రావద్దు. ఎందుకంటే నేను అక్కడికి రావడం లేదు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ‘ సూచించారు.
కాగా దేశంలో మొత్తం 93 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా కేంద్రం తెలిపింది. వీరందరూ విదేశాలనుంచి వచ్చిన వారేనని, ఇందులో 66 మంది విదేశాల నుంచి వచ్చిన భారతీయులు, 17 మంది విదేశీయులున్నారు. ఇందులో 10 మంది చికిత్స తర్వాత కోలుకోగా, ఇద్దరు చనిపోయారు. మరోవైపు కరోనా వైరస్ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే మాల్స్, సినిమా థియోటర్లు, పాఠశాలలు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.