సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం

మహారాష్ట్ర : సీరం ఇన్స్టిట్యూట్లో అగ్నిప్రమాదం సంభవించింది. పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది పది యంత్రాలతో సంఘటనా స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తుంది. ఈ ప్లాంట్లో పలు వ్యాక్సిన్లతో పాటు కొవిషీల్డ్ ఉత్పత్తి జరుగుతుంది. అగ్నిప్రమాదం వల్ల కొవిషీల్డ్ ఎటువంటి ఆటకం లేదని తెలిపారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా ఫర్మ్ ఆస్ట్రాజెనీకా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంలో కరోనా వ్యాక్సిన్ను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఎస్ఐఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ జాదవ్ మాట్లాడుతూ.. బీసీజీ వ్యాక్సిన్ సంబంధిత పనులు జరుగుతున్న ప్రాంతంలో మంటలు సంభవించాయన్నారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ, నిల్వ ఈ ప్రాంతానికి దూరంగా ఉందని పేర్కొన్నారు. పీఎంసీ చీఫ్ ఆఫీసర్ ప్రశాంత్ రాన్పైస్ మాట్లాడుతూ.. భవనంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో ముగ్గురిని రక్షించినట్లు వెల్లడించారు.