శాసనసభలో కొత్తగా 40 సీట్లు -మంత్రి వేముల

కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులతో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు చీఫ్ విప్లు సమావేశమయ్యారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్లమెంట్ ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. శాసనసభ, మండలి హాల్లో ఆరు అడుగుల దూరం ఉండేలా సీట్ల ఏర్పాటు చేశామని చెప్పారు. మార్షల్స్ రెండు రోజుల ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అసెంబ్లీకి వచ్చే అధికారులు, ఇతర సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ ఆధ్వర్యంలో మీడియా సిబ్బందికి కొవిడ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
శాఖల వారీగా అవసరం ఉన్న అధికారులు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. శాసనసభ, మండలిలో రెండు చొప్పున అంబులెన్సులతో పాటు పీపీఈ కిట్లు, ర్యాపిడ్ కిట్లు, ఆక్సీ మీటర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్రతి రోజూ అసెంబ్లీతో పాటు ఎమ్మెల్యే క్వార్టర్స్ను కూడా శానిటైజ్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు.